Thursday, February 7, 2013

శ్రీ మహాగణేశ పంచరత్న స్తోత్రం - భావ సహితం


శ్రీ  గురుభ్యోన్నమః

శ్రీ  గణేశాయ  నమః


సదాశివ  సమారంభాం  శంకరాచార్యమధ్యమాం!
అస్మదాచార్య  పర్యంతాం  వందే  గురు  పరంపరాం!!
శృతి  స్మృతి  పురాణానామాలయం  కరుణాలయం !
నమామి  భగవత్పాద  శంకరం  లోకశంకరం !!

శుక్లాంబరధరం  విష్ణుం  శశివర్ణం  చతుర్భుజం
ప్రసన్న  వదనం  ధ్యాయేత్  సర్వ  విఘ్నోపశాంతయే

(వివిధ  వ్యాఖ్యానములు,  పుస్తకములనుండి  సంకలనము    చేయబడినది)

ఎందరో  మహానుభావులు  అందరికీ  వందనములు

()        ముదాకరాత్త  మోదకం  సదా  విముక్తి  సాధకం
                కలాధరావతంసకం  విలాసి  లోకరక్షకం !
        అనాయకైక  నాయకం  వినాశితేభ  దైత్యకం
                నతాశుభాశునాశకం  నమామి  తం  వినాయకమ్ !!
భావము : సంతోషముతో (మోదముతో) మోదకములను రెండు చేతులా గ్రహించి, సదా విముక్తిని (మోక్షమును) కలుగజేసెడి, అందుకు  గుర్తుగా  చంద్రవంకను ధరించెడి,  విలాసించుచు  లోకములను  రక్షించెడి  శ్రీ  వినాయకునకు నమస్కారము. నాయకులు  లేని  వారలకు  నాయకుడైనట్టి (దిక్కులేని  వారికిఅన్ని  దిక్కులు  తానైనట్టి), గజాసుర  వధకు  కారణమైనట్టి,   భక్తుల పాలిట  అశుభములను  హేలగా  తృంచునట్టి,  తనకన్న  వేరొకటి  లేనట్టి శ్రీ వినాయకునికి  నమస్కారము.

()        నతే  తరాతి  భీకరం  నవోదితార్కభాస్వరం
                నమత్సురారినిర్జరం  నతాధికాపదుర్ధరం !
        సురేశ్వరం  నిధీశ్వరం  గజేశ్వరం  గణేశ్వరం
                మహేశ్వరం  తమాశ్రయే  పరాత్పరం  నిరంతరమ్ !!
భావము : నయితి అన్న భావనను వదిలి అహంకరించు వారికి  భీకర  స్వరూపుడై విఘ్నములను  కలిగించెడి, అప్పుడే ఉదయించిన బాల సూర్యునివలె ప్రకాశించునట్టియు,  ఆశ్రయించిన వారిని ఆపదలనుండి ఉధ్ధరించునటువంటి, దేవులకు దేవుడు, సమస్త   నిధులను   కృపచేయగలిగినట్టి    ఈశ్వర స్వరూపుడు, గణములకు ఈశ్వరుడు, తానే మహేశ్వరుడైనట్టి (ఆత్మావై పుత్రనామసి) ఆ పరాత్పరుడైన  (అన్ని  తత్వములకన్న  అధికమైనట్టి మాయ  కన్నా  అధికుడైన), బ్రహ్మమే  అగు   శ్రీ  వినాయకునికి  నమస్కారము.

()        సమస్త  లోక  శంకరం  నిరస్తదైత్యకుంజరం
                దరేతరోదరం  వరం  వరేభవక్త్ర  మక్షరం !
        కృపాకరం  క్షమాకరం  ముదాకరం  యశస్కరం
                మనస్కరం  నమస్కృతాం  నమస్కరోమి  భాస్వరమ్ !!
భావము : అన్ని లోకములకు శుభములను చేకూర్చెడివాదును, గొప్ప గొప్ప రక్కసులను   తొలగించినవాడును,  తక్కువకాని  బొజ్జ కలిగి  మహోత్తముడై ఉత్తమమైన  గజవదనము  కలవాడు, గొప్ప  దయ, కృప, క్షమ, ఓర్పు  కలవాడు, ఎల్లప్పుడు సంతోషములను  చేకూర్చెడివాడు, గొప్ప  కీర్తి  కలిగించెడివాడు, నమస్కరించువారలకు  మంచి  మనస్సునిచ్చువాడు, గొప్ప కాంతి కలవాడునగు శ్రీ వినాయకునకు నమస్కారము.

()        అకించనార్తిమార్జనం  చిరంతనోక్తి  భాజనం
                పురారి  పూర్వనందనం  సురారి  గర్వచర్వణం !
        ప్రపంచ  నాశభీషణం ధనంజయాదిభూషణం
                కపోల దానవారణం భజే పురాణ వారణమ్ !!
భావము : దరిద్రుల  దారిద్ర్యబాధల  పోగొట్టునదియు, వేదములచే ప్రతిపాదితమైనదియు,  త్రిపురహరుని  జ్యేష్ఠ  పుత్రునివలె వెలుగొందునట్టియు, దేవతలయొక్క శత్రువుల గర్వమును భంజించునట్టియు (నమిలివేయునట్టియు), ప్రపంచ నాశకాలమున (మహాప్రళయమందు) భయంకరమైనట్టియు, అగ్ని మొదలగు దేవతలకు శిరోభూషణమైనట్టియు,  తన చెక్కిళ్ళయందు మదజలముతో ఉండెడి పురాతనమైనట్టియు (మొదలు తెలియనట్టియు)  ఐన  గజ  ముఖముతో విలసిల్లెడి శ్రీ వినాయకునికి నమస్కారము.

()        నితాంతకాంతదంతకాంతి  మంతకాంతకాత్మజం
                అచింత్యరూప  మంతహీన  మంతరాయ  కృంతనం !
        హృదంతరే  నిరంతరం  వసంతమేవ  యోగినాం
                  మేకదంత  మేవ  తం విచింతయామి సంతతమ్ !!
భావము : ఎంతో గొప్పనైన, మనోహరమైన  దంతపు  కాంతి  కలిగినవాడు, యమునిని అంతము  నొందించిన శివునకు కొడుకై తనకెప్పుడూ  అంతములేక  విఘ్నములను తీసివేయుచు,  ఆలోచింపశక్యముకాని స్వరూపముతో మహాత్ముల, యోగిపుంగవుల హృదయమున ఎల్లప్పుడు నివసించెడివాడును,  సర్వలోక ప్రసిద్ధుడైన,  ఆ ఏకదంతుని    ఎల్లప్పుడు   మనసున ధ్యానించుచుండెదను.  

()        మహాగణేశ  పంచరత్న  మాదరేణ  యోన్వహం
                ప్రజల్పతి  ప్రభాతకే  హృది  స్మరన్  గణేశ్వరం !
        అరోగతా  మదోషతాం  సుసాహితీం సుపుత్రతాం
                సమాహితాయు  రష్టభూతిభ్యుపైతిసోచిరాత్ !!
భావము : మహాగణేశ  పంచరత్నమను ఈ స్తోత్రమును ప్రతి దినము ప్రాతః  కాలమున శ్రీ  వినాయకుని  మనస్సుయందు ధ్యానించుచు ప్రకటముగా ఎవరెవరు పఠిస్తారో, అట్టి వారికి వెంటనే ఆరోగ్యము, దోషములేని జీవనమును, మంచి విద్యను, జ్ఞానమును, చక్కని సంతానము కలవారై, దీర్ఘాయుష్కులై  అష్టైశ్వర్యములను అనుభవించి  మంగళమౌలను    పొందెదరు.

                  -ఇతి  శ్రీ  శంకరాచార్య  కృత  గణేశపంచకం   సంపూర్ణం-
                -శ్రీ  శంకరాచార్య  కృతమైన  గణేశపంచకము    సంపూర్ణము-

వివరణ : గణపతి గౌరి దేవి నలుగుపిండి ముద్దనియు, దానికా తల్లి ప్రాణమిచ్చినదని,    తరవాత గజాసుర సంహారాంతరము పరమ శివుడాతని తల నరికి దేవి ప్రార్థనతో గజాసురుని శిరమును అతికించాడన్న కథ కలదు, ఐనప్పట్టికీ ఇది ఒక అవతారమని ఈ స్తోత్రమునందు, శ్రీ వినాయకుడు అంతకు పూర్వమే కలడని అతి పురాతనుడని వర్ణింపబడెను,  ఆందుకు  ఆధారముగా  కింద  పేర్కొన్న విషయములను  పెద్దలు   పేర్కొందురు ౧)  లలితోపాఖ్యానమునందు  శ్రీ గణేశ  సృష్టి, విఘ్న  యంత్ర  భేధనమున వర్ణింపబడెను, ఇంకా, ౨) పార్వతి పరమేశ్వర వివాహమందు  విఘ్నేశ్వర  పూజ  చేసినట్టు  లోకంలో కలదు,  అంతకు  ముందు  లేని  గణపతికి  పూజ  సాధ్యము  కాదుగదా!

{పైన  తెలిపిన  భావములు  మరియు  వివరణలు అన్నీ  పెద్దల,  పండితుల, విజ్ఞుల  మరి ఎందరో మహానుభావుల అభిప్రాయములు. ఇది మీకు నచ్చి ఉంటే ఖ్యాతి వారిది.  అర్ధం చేసుకోవడంలో కాని, సంకలనం చేయడంలో కాని, ఎవైనా పొరపాట్లు లేదా  తప్పులు (అప్పు తచ్చులతో సహా) ఉంటే ఆ బాధ్యత నాది, సరి దిద్దుకొనే అవకాశాన్ని ఇచ్చి మార్పులు చేర్పులు నా కు తెలుపగలరు.}

సర్వం శ్రీ ఉమా మహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు







No comments:

Post a Comment