శ్రీ గురుభ్యోనమః
నమస్తే
సార తత్త్వోపదేశః
గురుబ్రహ్మ స్వయం సాక్షాత్ సేవ్యో వన్ద్యో ముముక్షిభిః
నో ద్వేహనీయ ఏవాయం కృతజ్ఞేన వివేకినా!!
గురువు సాక్షాత్తుగ పరబ్రహ్మస్వరూపుడు, ముముక్షువులైనవారిచే సేవనీయుడు, వందనీయుడు. వివేకి, కృతజ్ఞుడు ఐన శిష్యుడు, గురువునకెన్నడూ కష్టము కలిగించడు.
యావదాయుస్త్రయో వన్ద్యో వేదాన్తో గురురీశ్వరః
మనసా కర్మణా వాచా శ్రుతేరేవైష నిశ్చయః!!
జీవించి ఉన్ననాళ్ళు మనోవాక్కాయములతో వేదాంతములకు (ఉపనిషత్ విద్య), గురువునకు, ఈశ్వరునకు నమస్కారము చేయవలసినది. అని శ్రుతి నిశ్చయము చేసి ఉపదేశించుచున్నది.
భావాద్వైతం సదా కుర్యాత్ క్రియాద్వైతం నకర్హిచిత్
అద్వైతం త్రిషులోకేషు నాద్వైతం గురుణా సహ!!
అద్వైత భావమును ఎప్పుడూ కలిగి ఉండవలెను. కానీ ఎన్నడూ క్రియలో అద్వైత బుద్ధిని చూపవద్దు. ముల్లోకములయందూ అద్వైతబుద్ధిని ప్రదర్శించవచ్చు గానీ,
ఎన్నడూ
గురువుపట్ల అద్వైత బుద్ధిని ప్రదర్శింపరాదు.
(గురువుకి ఆ అద్వైత స్థితివల్ల తామిద్దరూ/సమస్తమూ ఒకటే అన్న భావన ఉండి ఉన్నా,
శిష్యుడు ఎంత అద్వైత స్థితిలో ఉన్నా గురువు వేరు నేను వేరు కాదు అంతా ఒకటే అని అద్వైత బుద్ధి ప్రదర్శించరాదు, ఈ శరీరం ఉన్నంత వరకు శిష్యునికి గురువు వందనీయుడే)
ఇతి శ్రీ శఙ్కరభగవత్పూజ్యపాదవిరచిత సారతత్త్వోపదేశః
ఇది శ్రీ శంకరభగవత్పూజ్యపాదులు బోధించిన సారతత్త్వోపదేశము
భావాద్వైతం సదా కుర్యాత్ క్రియాద్వైతం నకర్హిచిత్
శంకరుల అతి ముఖ్య సందేశాలలో మనం తప్పక ఆచరించాల్సిన వాటిలో ఇదీ ఒకటి, అద్వైత విమర్శకులు, అద్వైతంలో ఉన్నామనుక్కుని మాట్లాడేవారి మాటలకి శంకరులు ఏనాడో ఎలా ఉండాలో చెప్పారు.
భావమునందు ఎల్లప్పుడూ అద్వైతాన్నే అనుష్ఠించవలెను అంత మాత్రాన ఈ శరీర ధర్మాన్ని వదలరాదు కదా,
ఈ జీవనం ఉన్నంత వరకూ ఈ శరీరం ప్రకృతి పరంగా వేరుగా కనపడుతుంది దాని ధర్మాన్ని అది నిర్వర్తించాలి, ఐనా అద్వైత సిద్ధివల్ల అంతా ఒకటిగా స్థిరీకరింపబడినా, అది భావంలో ఉండాలి తప్ప క్రియారూపంలో కాదు, భావనల వల్ల క్రియాదోషం జరగరాదు. ఒకవేళ అంత పండినా గురువుయందు ఆ బుద్ధి ప్రదర్శించక గురువుని తనకన్న వేరైన అధికునిగానే ఎంచి నమస్కరించాలి.
జయ జయ శంకర హర హర శంకర - జయ జయ శంకర హర హర శంకర