Monday, February 18, 2013

శ్రీ శంకరాచార్య కృత శ్రీ కనకధారా స్తవం-05

ఈ క్రింది లంకె ద్వారా ముందటి భాగాన్ని చూడగలరు

శ్రీ శంకరాచార్య కృత శ్రీ కనకధారా స్తవం-04  


శ్లో4!! ఆమీలితాక్ష మధిగమ్య ముదా ముకున్ద
మానన్దకన్ద మనిమేష మనఙ్గతన్త్రమ్ !
ఆకేకర స్థిర కనినీక పద్మనేత్రం
భూత్యైభవేన్మమ భుజఙ్గశయాఙ్గనాయాః !!

తా:ఆమ్మా లక్ష్మీదేవీ! ఎప్పుడూ ఆనందమునిస్తూ కొద్ది కొద్దిగా తెరచియున్న కన్నులున్నవాడు, మన్మథుని తంత్రమును వశము చేసుకొనినవాడు, ఆదిశేషునిపై శయనించువాడు ఐన మహావిష్ణువు యొక్క పత్నివి నీవు. అర్థనిమ్మీలిత నేత్రాలతో స్థిరమైన చూపులతో పద్మము వంటి కనులతో శ్రీ మహావిష్ణువును చూచే చూడ్కులున్న తల్లీ మీ కళ్యాణ రూపము నాకు కళ్యాణ రూపము నాకు కళ్యాణమును కలిగించు గాక.

వివరణ: ఇక్కడ శంకరులు ముకున్ద అన్న పదంతో శ్రీ మహావిష్ణువుని సంబోధించారు. ముకున్ద అన్న పదానికి మోక్షమునిచ్చువాడు అని అర్థము. సంసార బాధలు లేక కేవలము మోక్షమును కోరే వారు ఆశ్రయించు వాడు శ్రీ మహావిష్ణువు. తాను ఎల్లప్పుడూ అర్థ నిమ్మీలిత నేత్రాలతో తన భక్తులను రక్షిస్తూ వారికి ఆనందము కలిగించేవాడు శ్రీ మహావిష్ణువు. ఐతే శ్రీ మహావిష్ణువు మన్మథుని తంత్రాన్ని వశము చేసుకున్నవాడు అని శ్లోకంలో చెప్పారు, అసలు మన్మథుడు ఆయన కొడుకే కదా, మన్మథునికి ఉన్న శక్తికి కూడా కారణం విష్ణువే. ఇక ఆయన భుజగశయనుడు, పాము మీద పడుక్కుంటాడు. రెంటి అర్థం ఏమంటే జనన మరణాలకై అతీతంగా మోక్షాన్ని ఇవ్వగలిగినవాడు. మన్మథుడు పుట్టుకకు కారకుడు, మన్మథ బాణం తగిలితేనేకదా జీవుల జననం సంభవిస్తుంది. పాము మృత్యువునకు సంకేతం, పాము కాటు వేసిందంటే మృత్యువు గ్రసించినట్టు అని అర్థం. మరి శ్రీ మహావిష్ణువో, అందరి పుట్టుకకీ కారణమౌతున్న మన్మథుణ్ణే కన్నవాడు, మృత్యువును తన తల్పంగా కలిగినవాడు, అంటే తన అవసరానికి ఆసనంగా, తల్పంగా వాడుకునేవాడు. అంటే రెంటికి అతీతుడు. మరి మోక్షాన్ని ఇచ్చి కామాన్ని, మరణాన్ని శాసించగలవాడు అలాగే తన భక్తులనీ కాపాడుకో గలిగినవాడు. (ఇక్కడ శ్రీ హరిని పరబ్రహ్మ తత్త్వంగా సృష్టి, స్థితి, లయలను ఆధీనములో కలవానిగా కీర్తించారు శంకరులు) అటువంటి శ్రీహరిని పద్మములవంటి తన కళ్ళతో కనుపాప కదలకుండా స్థిరమైన చూపులతో సగము మూసిన కనులతో చూచి మన్మథ తన్త్రాన్నే వశము చేసుకున్న శ్రీ మహావీష్ణువుకు ఆనందము కలిగించు చూపులున్న తల్లీ మీ కళ్యాణ కారకమైన చూపులు మాకు కూడా కళ్యాణమును కలిగించు గాక! అని ప్రార్థించారు.

సందర్భం ప్రకారం: అమ్మా లక్ష్మీ దేవీ! పేద బ్రాహ్మణ కుటుంబానికి ఏపుణ్యమూ లేదు అని కాదా నీవు ఐశ్వర్యమివ్వడానికి కుదరదన్నావు. సరే, నువ్వు స్వయంగా జనన మరణాలకు అతీతంగా ఉండి తన భక్తులను రక్షించే శ్రీ మహావిష్ణువుకి ఇల్లాలివి. వీరేమో ఏకాదశీ వ్రతం చేసి ద్వాదశి పారణ విధిగా చేస్తున్నవారు. మరి శ్రీ మహావిష్ణువు తన భక్తులు రక్షించే గుణమున్నవాడు. ఆయనకి ఎప్పుడూ ఆనందం కలిగించేదానవు నువ్వు, మన్మథుని పుట్టించిన ఆయనకే ఆనందం కలిగించే నీ చూపులు, ఒక్క సారి బీద బ్రాహ్మణ కుటుంబం మీద పడితే దాని వల్ల వారు ఉద్దరింపబడితే, శ్రీ మహావిష్ణువు నీ చూపుల ద్వారా తన భక్తులు ఉద్ధరింపబడ్డారని ఇంకా ఆనందం పొందగలడు. తల్లీ మీ చల్లని కళ్యాణ కారకమైన చూపులచే మాకందరికీ కళ్యాణమగు గాక!

No comments:

Post a Comment