ఈ క్రింది లంకె ద్వారా ముందటి భాగాన్ని చూడగలరుశ్రీ శంకరాచార్య కృత శ్రీ కనకధారా స్తవం-03
విశ్వామరేంద్ర పద విభ్రమ దానదక్ష
మానంద హేతురధికం మురవిద్విషోపి !
ఈషన్నిషీదతుమయి క్షణమీక్షణార్థ
మిన్దీవరోదర సహోదర మిన్దిరాయాః!! 3
మానంద హేతురధికం మురవిద్విషోపి !
ఈషన్నిషీదతుమయి క్షణమీక్షణార్థ
మిన్దీవరోదర సహోదర మిన్దిరాయాః!! 3
తా: ఇంద్రాది దేవతలకు ముల్లోకములను అమరావతిని కట్టబెట్టగలిగిన దయతో కూడిన విష్ణుభగవానుని ఆనందమును వృద్ధిచేయు చూపులు కలిగిన తల్లీ, చతుర్ముఖ బ్రహ్మకి సోదరీ ! ఒక్క క్షణము నీ కరుణాపూరిత చూడ్కులు మాపై ప్రసారముచేయుదువుగాక!
వివరణ: ఇక్కడ కూడా విష్ణుమూర్తిని పరోక్షంగా మురారి అని, మురవిద్విషోపి అన్న పద ప్రయోగం ద్వారా సంబోధించారు శంకరులు. దానము చేయకుండా తనదిగా అన్నీ దాచుకున్నవానికి శత్రువైన శ్రీమహావిష్ణువు, దేవాంద్రాదులకు స్వర్గాది లోకములను తన దయతో దానమిచ్చాడు. ఇది ఎప్పుడు జరిగింది ఎలా జరిగింది అని చూస్తే. ఒకానొకనాడు దుర్వాసో మహర్షి అమ్మవారిచ్చిన పుష్పహారాన్ని చేత బట్టుకుని వెళ్తూండగా దేవేంద్రుడు ఐరావతం మీద ఎదురైనప్పుడు దేవేంద్రునికి మంగళం చెప్పి ఆశీర్వదించి దుర్వాసో మహాముని ఇంద్రునికి అమ్మవారిచ్చిన పుష్పహారాన్ని ఇచ్చారు. తరవాత అహంకారంతో ఉన్న దేవేంద్రుడు ఆ హారాన్ని ఐరావతం మీదకి విసిరి వెళ్ళిపోయాడు. తద్దోషంగా లక్ష్మీ దేవి పాల సముద్రంలోకి వెళ్ళిపోయింది. ఇంద్రుని అహంకారం వల్ల లక్ష్మీ దేవి దేవలోకాన్నే కాక వైకుంఠాన్ని కూడా వదిలి పాల సముద్రంలో చేరిపోయింది. తరవాత ఇంద్రుడు అన్ని బాధలు పడ్డాడు, తరవాత క్షీర సాగర మథనం జరిగి లక్ష్మీ దేవి పైకి వచ్చి శ్రీ మహావిష్ణువుని మళ్ళీ చేరింది(ప్రకటంగా చేరింది, వారిద్దరూ విడివడినదెన్నడు గనక?). అటువంటి అహంకారి, నీ ప్రసాదమైన పుష్పమాలనే తిరస్కరించినవాడు రాజ్య భ్రష్టుడౌతే, స్వయంగా శ్రీ మహావిష్ణువే ఇంద్రునికి తమ్ముడుగా, పన్నెండు నెలలు గర్భవాసం చేసి వామనావతారమెత్తి, ఇంద్రునికి తమ్ముడు కనుక ఉపేంద్రుడను పేరు పెట్టుకుని, ఒకరికి ఇవ్వడమే ఎరిగిన శ్రీహరి, బలి చక్రవర్తి వద్ద చేయిచాచి దానమడిగి మూడులోకాలనూ కొలిచి బలిని పాతాళానికి త్రొక్కి అలా దానంగా సంపాదించిన రాజ్యాన్ని ఇంద్రునికిచ్చాడు. అటువంటి విష్ణుమూర్తి గుండెలలో ఉండేదానివి నీవు. నీ చల్లని చూపులతో అంత దయగలిగిన విష్ణుమూర్తికే ఎంతో ఆనందాన్ని కలిగించేదానవు. విష్ణు మూర్తి నల్లని కలువ పువ్వైతే అందులోని సౌకుమార్యం అంతా ఆయన దయ. దాని మధ్యలోనున్న దుద్దు అతి సుకుమారం మధ్య భాగం ప్రకాశవంతం ఇంకా చల్లన. చల్లని నల్లని విష్ణుమూర్తి అనే కలువ పువ్వుగుండెలోని అత్యంత సౌకుమార్యమైన అత్యంత చల్లనైన మధ్య భాగం వంటి మా అమ్మ దానవు లక్ష్మీదేవివినువ్వు. పువ్వుకన్నా మధ్యభాగంలోనే ఆర్ద్రత, చల్లదనం ఎక్కువ... మరి ఆ చల్లని చూడ్కులు మాపై ప్రసారం చేసి మమ్మల్ని రక్షించవా తల్లీ!
సందర్భం ప్రకారం: క్రిందటి శ్లోకంలో చేప్పినట్లు దానం చేయనివారికి శత్రువైన విష్ణుమూర్తి (మురారి), స్వయంగా తానే ఇంద్రునికోసం దానం పట్టి, తద్వారా వచ్చిన దాన్ని ఇంద్రునికి దానమిచ్చేశాడు. శ్రీ హరిగా పాపాలను తీయగలడు కానీ దారిద్రాన్ని తీసి పుణ్యఫలంగా ఐశ్వర్యాన్ని ఇవ్వగల అన్నదానికి ఉదాహరణగా పైన చెప్పిన దుర్వాసో మహర్షి, అమ్మవారిచ్చిన పూమాల, ఇంద్రుడు, క్షీరసాగర మథనం, వామన, బలి చక్రవర్తి కథ మొదలైనవి సూచించారు. అంటే భగవంతుని పట్ల , భాగవతుల పట్ల చేసిన తప్పునే దిద్ది తిరిగి ఐశ్వర్యాన్ని రాజ్యాన్ని ఇవ్వగల దయ కలిగిన హృదయం కలిగినవాడు శ్రీ మహావిష్ణువు. ఆ చల్లని విష్ణువు గుండెలలో ఇంకా చల్లగా ఉన్న తల్లివి నువ్వు, ఎంతో దయగల మీ ఇద్దరూ,ఈ బ్రాహ్మణ కుటుంబం యొక్క పాపాలను తీసి వీరిని ఉద్దరించి ఐశ్వర్యాన్ని కలుగచేయవలసినది అని శంకరులు ప్రార్థించారు.
No comments:
Post a Comment