ఈ క్రింది లంకె ద్వారా ముందటి భాగాన్ని చూడగలరు
శ్లో5!! కాలాంబుదాళి లలితోరసి కైటభారేర్
ధారాధరే స్ఫురతి యా తటిదంగనేవ !
మాతస్ సమస్త జగతామ్ మహనీయ మూర్తిర్
భద్రాణి మే దిశతు భార్గవ నందనాయా: !!
తా : మబ్బు మధ్యలో మెఱయు మెఱుపు వలె విష్ణుమూర్తి యొక్క నీలమేఘ సన్నిభమైన వక్ష:స్థలమునందు విలసిల్లు మహనీయ మూర్తి, సకల జగన్మాత, శ్రీ మహాలక్ష్మీ భగవతి నాకు సమస్త శుభములను గూర్చు గాక !
వివరణ: శంకరులు ఇక్కడ శ్రీ హరిని కైటభారే అని సంబోధించారు, ఇక కైటభారే అన్న విషయానికొస్తే, మధు కైటభులనే రాక్షసులను శ్రీ మహావిష్ణువు సృష్టి ఆరంభంలో సంహరించారు. మధు కైటభులు ఇద్దరూ సోదరులు, వారెవరో కాదు, మధువు=నేను; కైటభుడు=నాది అనే గుణాలు. నాది అనేటప్పటికి మనం మన చేతులను గుండెలమీదపెట్టి నాది అంటాం. అటువంటి గుణానికి ప్రతినిధి ఐన కైటభుని సంహరించినవాడు శ్రీ హరి. అంటే అటువంటి గుణమునకు శత్రువు అని అంతర్లీనంగా కైటభ వృత్తాంతాన్ని పొందు పరిచారు శంకరులు.
అంతేకాక కాలాంబుదాళి అన్న పద ప్రయోగం ద్వారా భగవంతుని కురవడానికి సిద్దంగా ఉన్న నల్లనిమేఘంతో పోలిక వేశారు. శ్రీహరిని నీల మేఘ శ్యాముడని పిలుస్తారు, కురవడానికి సిద్దముగా ఉన్న మేఘం, మీన మేషాలు లెక్కపెట్టదు, ఎవరున్నారు ఎవరు లేరు చూడదు, దాహార్తి తో ఉన్నవాడు ఒక్కడే ఉన్నాడు కదా ఆ ఒక్కడికే కురుద్దామని మేఘము ఆలోచించదు. ఒక్కపెట్టున తన దగ్గరున్నదంతా కురిసేసి వెళ్ళిపోతుంది. అటువంటి శ్రీహరి లలితమైన హృదయం కలవాడు. కారుణ్యమనే నీటితో నిండిన ఈ నల్ల మబ్బు గుండెలో దాక్కుని ఒక్కసారిగా స్ఫురించిన మెరుపు తీగ/ తటిల్లత/ బంగారు తీగ శ్రీ మహాలక్ష్మి. మెరుపు తీగతో కూడిన నల్లని మబ్బులు జనులందరకూ ఆహ్లాదకారకములెలాగో, అలా ఒకరిలో ఒకరైన మీ ఇద్దరి దర్శనము మాకు భద్రము చేయుగాక. అమ్మా మెరుపు తీగ స్వరూపమైన నువ్వు ఒక్కసారి మాపై దయతో మెరిసి కనిపిస్తే, ఆ మెరుపులో మేఘ స్వరూపమైన భగవంతుని చూపించే కారుణ్యమున్న దానవు (అంటే అమ్మ దయ ఉంటే అయ్యవారి దర్శనం చేయిస్తుంది అన్న భావన, భగవంతుని సౌందర్య దర్శనము చేయించినది అమ్మ. అంతేకదా!). అమ్మా నువ్వు అందరకూ తల్లివి కదా మరి అమ్మవైన నువ్వు ఇలా కష్టపడుతున్న బీద బ్రాహ్మణ కుటుంబాన్ని ఉద్దరించాలికదా. అమ్మా అంత కారుణ్యమున్న భగవంతుని గుండెలలో ఉన్న దానవు నువ్వు. అమ్మా ఆ భగవంతుని కారుణ్యము, ఔదార్యము నువ్వే కదా. అలా వీరిని ఉద్దరించగలిగిన శక్తిగా ఆయన గుండెలలో ఉన్నది నువ్వే కదమ్మా!
సందర్భం ప్రకారం: పూర్వ జన్మలలోఅలా నాది నాది అని గుండెలమీదనే చెయ్యిపెట్టుకుని చెయ్యిని తిరగేసి దాన ధర్మాలు చేయలేదు కనకనే బీద బ్రాహ్మణ కుటుంబానికి ఇప్పుడు దరిద్రం ఉన్నది అటువంటి దరిద్రాన్ని తొలగతోసే మేఘ స్వరూపమైన భగవంతుని కారుణ్యం ఇక్కడ కురవాలంటే భగవంతుని దర్శనం చేయించగలిగి, ఆయన గుండెలలో ఉండే నువ్వు ఒక్క సారి కారుణ్యాన్ని వర్షింపజేయి. ఈ బీదబ్రాహ్మణి అమ్మతనంతో నాకు ప్రేమతో ఒక అమ్మలా భిక్ష వేసింది. అమ్మ తనానికే పరాకాష్ట నువ్వు. అన్ని జగములకూ అమ్మవు నువ్వు. అమ్మా మరి ఆ అమ్మ ఇచ్చిన భిక్షను నేను సంతోషం తో స్వీకరించాలంటే మరి ఈ అమ్మ కష్టాన్ని తీయలేవా. ఎంత కారుణ్యముంటే నువ్వు భృగుమహర్షికి కూతురిలాపుట్టావు తల్లీ. అంత కారుణ్యమున్న మీరిరువురూ ఒక్కసారి కారుణ్యామృత చూపులు ఒక్కసారి మెరుపు మెరిసినట్టుగా ప్రసరిస్తే వీరి దారిద్ర్యం తొలగిపోతుంది.
No comments:
Post a Comment