శ్రీ గురుభ్యోనమః
సృష్టిలో 84 లక్షల జంతుకోటి ఉన్నదని చెప్పబడింది. ఈ సమస్త జీవకోటి నిరంతరమూ ప్రయత్నించేది దేనికి అని ప్రశ్న వస్తే దాని సమాధానం ’సుఖముగా ఉండడం కొరకు మాత్రమే’ అన్నది నిర్వివాద సమాధానం. ఎంత కష్టపడ్డా, ఏ పని చేసినా చేయకున్నా ప్రతి జీవి ప్రయత్నించి కోరుకునేది సుఖమే. ఏ ప్రాణీ కూడా నాకు సుఖమక్కరలేదు అని చెప్పదు కదా... పైగా ఎంత ఎక్కువ సుఖం పొందాలా అని తాపత్రయపడుతూ ఉంటుంది. అన్ని వృత్తులు సుఖము కొరకే అని కదా ఆర్యోక్తి.
పరిశీలనము, వివేచన, వివేకము, బుద్ధి అను వివిధ వివిధములుగా వ్యావహారికంలో తెలియబడుతున్న విలక్షణమొకటి మనిషిని మొత్తం 84 లక్షల జంతుకోటి నుండి వేరు చేస్తున్నది. బుద్ధి వికసనము చేత పరిశీలనము చేత మాత్రమే మనిషి మిగిలిన జీవరాశినుండి వేరుపడి విశిష్టమైన జంతువు/జీవిగా తెలియబడుతున్నాడు. మనిషి ఈ అన్ని సుఖములు అనుభవించినమాత్రకన్నా ఎక్కువ అనుభవించుటచేత దుఃఖములే అవుతున్నాయని యెఱిగి అసలు సుఖమును గూర్చిన విచారణ చేయగలిగినవాడు మనిషి ఒక్కడే. అది ఏ సుఖము, దాని సాధన విశేషాలేమిటి వగైరా వగైరా పరిశీలనము చేయాలి. ఆ వివేకమే మనిషిగా పుట్టిన వాడు చెయ్యవలసినది ముఖ్యమైనదీనూ... అలా పరిశీలనము, వివేకము లేని మానవ జన్మకు విశిష్టత కుదరదు, తక్కిన జంతుకోటితో ఆమనిషిని కూడా కలిపి చెప్పవలసి ఉంటుంది.
ఈ పరిశీలనలో కలిగే ముందు అనుమానాలాలో నేనెలా వచ్చాను ఎందుకు వచ్చాను, ఈ కనపడుతున్నదంతా ఎలా వచ్చింది సృష్టి ఆది ఏది ఇలా సాగుతుంది... వీనికి సమాధానం కేవల మానవ మేధస్సుకు సాధ్యం కాదు కారణం దేనినీ మానవుడు సాధించలేదు అంటే నిర్మించలేదు. దీనిని సాధించుటకు అసలు సృష్టి ఎవరు చేసారు వారి సహాయం కోరుతుంది మన బుద్ధి. ఆయనను పరబ్రహ్మంగా తెలిసి దానినుండి వ్యక్తమైన వేద, వేదాంత, వేదాంగాదులను సహాయముగా తీసుకుని విచారణ మొదలుపెడుతుంది. అవి అందరికీ అందనివి అవ్వడం వలన కారుణ్య మూర్తులైన ఋషులు తేలికగా తంత్ర,పురాణేతిహాసాల రూపంలో అందించగా మరింత తేలిక చేసినవారు వ్యాసులు. వేద వేదాంతాలను బ్రహ్మ సూత్రాలుగా , వేదాంత సారాన్ని భగవద్గీతగా, పురాణాలుగా ఎంతో అపారమైన వాఙ్మయాన్ని అందించారు.
కానీ, కలిలో మానవులు అలసులు, మందబుద్దులు, అల్పాయుష్కులు, అవైదిక మార్గ తత్పరులు అవ్వడం చేత సాక్షాత్ దక్షిణామూర్తియే కలియుగంలో మరో గురుమూర్తిగా "జగద్గురు శ్రీ శ్రీ శ్రీ ఆది శంకర భగవత్పాదులు"గా అవతరించి సామాన్య మానవ మేధస్సులకందని నిగూఢమైన వేద, ఔపనిషద్, తంత్ర, మంత్ర, పురాణ స్తోత్రాదులను సులభరీతులలో ప్రకరణ గ్రంథాలుగా, స్తోత్రాలుగా, ఇచ్చి ప్రస్థాన త్రయ భాష్యమిచ్చి నిగూఢమైన శాస్త్రార్థములను సామాన్య మానవుని దగ్గరకు చేర్చారు. అవైదిక మత ప్రాచుర్యాన్ని ఖండించి సంస్కరించి షాణ్మత స్థాపన చేసారు పంచాయతన పూజ నెలకొల్పారు. భారతావని చుట్టూ నాలుగు ఆమ్నాయ (ఆమ్నాయము=వేదము) మఠాలు పెట్టారు. కంచిలో సర్వజ్ఞపీఠాన్ని అధిరోహించారు. ఇవేకాక కాశీలో ఉన్న గురుపీఠము (ప్రస్తుతం శృంగేరి వారి అధీనమునందు ఉన్నది) కూడా వారి స్థాపనయే అని కర్ణప్రమాణం. ఈ నాడు సిద్ధాంతాలకతీతంగా షాణ్మతాలవారమూ మన ఇష్టదైవాన్ని మనస్ఫూర్తిగా స్మరించుకుంటున్నామంటే, పూజిస్తున్నామంటే, స్తుతిస్తున్నామంటే, వేద ఘోష వినపడుతోందంటే, మన ధర్మంలో చరిస్తున్నామంటే అది కేవల శంకరుల కఠోర శ్రమ ఫలితం తప్ప మరోటి కాదు. భిన్నత్వంలో ఏకత్వాన్ని చూపి, ఐకమత్యాన్ని నెలకొల్పిన మహానుభావుడు.
అటువంటి శంకరులకి కృతజ్ఞతాపూర్వక సాష్టాంగవందనాలు సమర్పిస్తూ ,
-శంకర కింకర...
సర్వం శ్రీ గురుచరణారవిందార్పణమస్తు...
No comments:
Post a Comment