శ్లో7!!
ప్రాప్తమ్ పదమ్ ప్రథమత: ఖలు యత్ ప్రభావాత్
మాంగల్య భాజి మధుమర్దిని మన్మథేన !
మయ్యాపతేత్ తదిహ మంథర మీక్షణార్ధమ్
మందాలసం చ మకరాలయ కన్యకాయా: !!
తా : దేని ప్రభావముచేత మన్మథుఁడు సమస్త కల్యాణ గుణాభిరాముఁడైన శ్రీ విష్ణుమూర్తి యొక్క మనస్సునందు (ఆయనను మన్మథబాధకు గుఱిచేయుట ద్వారా) మొదటి సారిగా స్థానము సంపాదించుకొన్నాడో, ఆ లక్ష్మీదేవి యొక్క నెమ్మదైన మఱియు ప్రసన్నమైన ఓరచూపు నా మీద ప్రసరించు గాక !
వివరణ: ఈ శ్లోకంలో కూడా శంకరులు మధుమర్దిని అన్న పదాన్ని విష్ణువుకు వాడారు, ఆంతరంగా అమ్మవారికీ ఈ పదాన్ని వాడారు. అలా ఎలా అంటే, మధు కైటభులను శ్రీహరి సంహరించినప్పుడు జగజ్జనని మధు కైటభులను మోహపరచడానికి (కామప్రదమైన) తన చూపులను మధుకైటభులపై ప్రసరింపజేయగా దానితో విర్రవీగిన ఆ రాక్షసులు విష్ణువుకే వరం ఇవ్వడానికి సిద్దపడగా విష్ణువు వారి చావునే వరంగా కోరాడు అలా ఆ తల్లి తన చూపులతో మొట్టమొదటి రాక్షస సంహారంగా తన చూపులతో విష్ణువును అనుగ్రహించి అందరికీ అన్నీ ఈయగల విష్ణువుకు మధుకైటభ సంహారం అనే కోరిక తీర్చినది. దీనిద్వారా మధుమర్దిని అన్న నామం శ్రీమహావిష్ణువుకు అమ్మవారికీ కూడా చెందుతుంది.
ఏ అమ్మవారి చూపుల ప్రభావంచేత మధుకైటభులు మోహాంధులై సంహరింపబడ్డారో, ఏ చూపుల వలన మధువనే రాక్షసుని చంపే మంగళకార్యం శ్రీహరి చేయగలిగెనో, అటువంటి చూపులు కలిగిన తల్లి లక్ష్మీ దేవి (ఇక్కడ లక్ష్మీదేవిని ఆదిశక్తిగా శంకరులు కొలుస్తున్నారు) విష్ణుభగవానుని హృదయమనే స్థానాన్ని అలంకరించినట్టి లక్ష్మీదేవి, నిర్హేతుకంగా మొసళ్ళు మొదలగు కౄర ప్రాణులు నివసించు సముద్రుని కరుణించి కూతురుగా పుట్టిన తల్లి లక్శ్మీదేవి తన నెమ్మదైన, కరుణాపూరితమైన నిమ్మీలిత నేత్ర దృష్టిని మాపై ప్రసారం చేయుగాక.
సందర్భం ప్రకారం: అమ్మా లక్ష్మీదేవీ, ఏ కారణముందని నీ కరుణతో తనలో ఎన్నో కౄరప్రాణులని ఉంచి పోషిస్తున్న సముద్రునికి కూతురువయ్యి లక్ష్మీదేవి తండ్రి అని సముద్రునికి కీర్తినిచ్చావు? అది నీ అపార దయ కారుణ్యం, అది నిర్హేతుకము. అలాగే అదే కారుణ్యముతోటి ఈ బీద బ్రాహ్మణ కుటుంబాన్ని ఉద్దరించవా. అమ్మా నీ మోహపు చూపుల ప్రభావంచేతనేకదా మధువనే రాక్షసుని వధ అనే మంగళ కార్యమును శ్రీమహావిష్ణువు నిర్వర్తించినాడు. ఒకేసారి నీ చూడ్కులు రాక్షసులు సంహరింపబడడానికి, శ్రీమహావిష్ణువు రాక్షస సంహారమనే మంగళకార్యముచేయడానికి హేతువులైనాయి కదా. మరి ఈ బీద బ్రాహ్మణ కుటుంబానికి ఏ హేతువులేక ఐశ్వర్యాన్ని ఇవ్వలేకపోతే, నీచూపులను ప్రసరింప జేసి అవే హేతువులుగా చూపి ఐశ్వర్యాన్ని కటాక్షించు తల్లీ. అందరికోర్కెలు తీర్చే విష్ణుభగవానుని కోర్కెలే తీర్చగలిగిన నీచూపులు దరిద్రులైన వీరిని ఉద్దరించగలవు. కాబట్టి నీ కరుణాపూరితమైన చూపులను మాపైన వర్షింపజేయి.
No comments:
Post a Comment