Thursday, March 14, 2013

శ్రీ శంకరాచార్య కృత శ్రీ కనకధారా స్తవం-07

శ్లో6!! బాహ్యాంతరే మధుజిత: శ్రితకౌస్తుభే యా
హారావళీవ హరినీలమయీ విభాతి !
కామప్రదా భగవతో౭పి కటాక్ష మాలా
కల్యాణ మావహతు మే కమలాలయాయా: !!
తా : శ్రీ మహావిష్ణువు యొక్క వక్ష: స్థలమునందలి కౌస్తుభ మణి నాశ్రయించి దాని లోపల, వెలుపల కూడ ఇంద్రనీల మణిహారములవంటి ఓరచూపులను ప్రసరింప జేయుచు కోరికలను తీర్చు లక్ష్మీదేవి నాకు శ్రేయస్సును చేకూర్చు గాక !

వివరణ: శ్రీ శంకరులు శ్లోకంలో శ్రీ హరిని మధుజితః అన్న నామంతో సంబోధించారు. పై శ్లోకంలో వివరించినట్లు మధువు=నేను; కైటభుడు=నాది అనే గుణాలు. ముందు నాది అనే భ్రాంతిని తొలగతోసి తరవాత నేను అనే అహంకారాన్ని తొలగతోయగలడు శ్రీ హరి అన్న అర్థాన్ని స్ఫురించేలా ముందు శ్లోకంలో కైటభారే అని తరవాత శ్లోకంలో మధుజిత్ అన్న నామాన్ని వాడారు. నేను నాది అన్న భావన పోయిననాడు మనిషికి పాప కర్మలు చేయవలసిన పని ఉండదు, నేను నాది అన్న భావన తొలగుతే అంతా పరబ్రహ్మమును చూస్తూ ఆత్మగా మిగిలిపోయి, తన పక్కవారి బాధను తనదిగా తలచి వారికి వలసిన దాన ధర్మాలు సహాయాలు చేయగలడు. మధు కైటభులను సంహరించిన శ్రీమహావిష్ణువు వక్షస్థలమందు అమ్మ లక్ష్మీదేవి కొలువై ఉండి తన చూపులను ప్రసారం చేయగా చూపులు ఆయన హృదయంలోనూ, బయట ఉన్న కౌస్తుభమణికి గొప్పనైన ప్రకాశముని ఇవ్వగలిగిన చూపులు చూపులు. తనతోపాటు సముద్రములో పుట్టినదే ఐనా కౌస్తుభమణి కాంతులు అమ్మ చూపుల కాంతి వల్లనే ప్రకాశిస్తున్నాయి అన్న అర్థం కూడా అన్వయమయ్యేటట్టు తల్లి లక్ష్మీదేవిని "కమలాలయాయాః" అని సంబోధించారు. విష్ణువక్షస్థలవాసిని ఐన తల్లి నల్లని చల్లని చూపులు విష్ణు భగవానుని గుండెలపై వేసిన ఇంద్రనీలమణుల హారములవలె ఉన్నాయి. అటువంటి చల్లని చూపులు మాకు శ్రేయస్సునుచేకూర్చుగాక.

సందర్భం ప్రకారం: అమ్మా స్వయంగా శ్రీ విష్ణుభగవానుని కోర్కెలే తీర్చగల శక్తివి నీవు, విష్ణుభగవానుడు ఇతరుల కోర్కెలు తీరుస్తున్నాడూ అంటే దానికి మూల శక్తివి నువ్వెకదమ్మా! నేను నాది అన్న భావంతోటే పోయినజన్మలో చేసిన పుణ్యం లేక ఇప్పుడు దరిద్రం అనుభవిస్తున్నారు బీద బ్రాహ్మణులు. అందరికోర్కెలు తీర్చే విష్ణుభగవానునికి కోర్కెలుతీర్చేశక్తిగా ఆయన గుండెలలో ఉన్నది నువ్వేకదమ్మా . అటువంటి మీ చూపులు ఒక్కసారి వీరి మీద ప్రసరిస్తే చూపులు వారికి శ్రేయస్సును కలిగిస్తాయి అని శంకరులు ప్రార్థించారు.

No comments:

Post a Comment